త్రిష కావాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే!
ఇరవై ఏళ్ల నుంచి సౌత్ ఆడియన్స్ ను అలరిస్తూ తనకంటూ మంచి క్రేజ్ ఏర్పరచుకుంది చెన్నై భామ త్రిష. మధ్యలో కొన్నేళ్ల పాటూ కెరీర్ కు బ్రేక్ పడినా త్రిష మాత్రం ఏనాడూ ఇండస్ట్రీని వదిలి వెళ్లలేదు. త్రిష నమ్మకం నిజమై మళ్లీ ఫాం లోకి వచ్చేసింది. కోలీవుడ్ లో త్రిష నటించిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ అమ్మడు క్రేజ్ ను అమాంతం పెంచేసింది.
ఆ సినిమా తర్వాత త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. విజయ్ సరసన లియో సినిమాలో ఆఫర్ అందుకుని మంచి హిట్ కొట్టిన త్రిష, టాలీవుడ్ లో కూడా మంచి ఛాన్స్ లు అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమా చేస్తుంది. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు కూడా డిస్కషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అటు తమిళంలో, ఇటు తెలుగులో మొత్తం మీద త్రిష చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష కొత్త సినిమాకు సైన్ చేయాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే అంటున్నారు. కోలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్న త్రిషకు విశ్వంభరలో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్లు చెప్తున్నారు. అందుకే ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేవరకు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని త్రిష డిసైడైనట్లు తెలుస్తోంది.