కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: కిషన్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే రాష్ట్రంలో బీజేపీ అఖండ మెజారిటీతో గెలబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని, అంతా నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రిజర్వేషన్ల లబ్ది పొందుతున్న ఎస్సీ, ఎస్టీ బడుగు, బలహీన వర్గాల ప్రజలే బీజేపీకి ప్రచారం చేస్తున్నారని, వారంతా మోదీ నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం బీజేపీ రిజర్వేషన్లను ఖతం చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కలవరం పెరిగిపోతోందని, సీఎంలో అసహనం పెరిగిపోతోందని, అందుకే బాధ్యతారాహిత్యంగా శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. ఇంకా రేవంత్కు తానే సీఎంనని నమ్మకం కుదరడం లేదని, అందుకే రిపోర్టర్లను జైల్లో పెట్టాలంటూ విచిత్రంగా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలతోనే రేవంత్కి ఎంత అహంకారం, గర్వం ఉందో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.