ఆ సంస్థ తెలంగాణకే తలమానికం : భట్టి
కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడరు. బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించనుంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది. సింగరేణి అంటే ఉద్యోగాల గని, ఆ సంస్థ తెలంగాణకే తలమానికం. రాష్ట్రంలో 40 బొగ్గు గనుల్లో ఉత్పత్తి జరుగుతోంది. 2030 కల్లా వాటిలో 22 మూతపడతాయి. ఇప్పుడున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి 15 టన్నులకు పడిపోనుంది. కొత్త బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుంది.
దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని బీజేపీ చట్టం తీసుకొచ్చింది. బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలని చట్టం వేసింది. దానికి బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కూడా మద్దతు తెలిపారు. వీళ్లు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. గతంలో సింగరేణి పక్కనున్న బొగ్గుబావులకు వేలంపాట నిర్వహిస్తుంటే వాటిని తీసుకోవద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారికి కావాల్సిన వారి కంపెనీలకు లబ్ధి కలగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. పక్క రాష్ట్రం ఒడిశాలో బిడ్ వేయడానికి పంపించారు. ప్రస్తుతం శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోంది. ఆ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తా. సింగరేణిని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రధానిని కలుస్తాం. బొగ్గు నిల్వలు తగ్గిపోతే సింగరేణి వ్యవస్థను నమ్ముకున్న వేలాది కుటుంబాలు అన్యాయానికి గురవుతాయి అని అన్నారు.