మా ఉద్యోగాలు మాకివ్వండి.. వాలంటీర్ల వేడుకోలు..
ఉద్యోగం, సద్యోగం లేనప్పుడు ఎలా ప్రవర్తించినా పర్లేదు. కానీ ఓసారి చిన్నదో, పెద్దదో ఉద్యోగంలో చేరితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. కాదని గీతదాటితే.. తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడిదే పరిస్థితి ఏర్పడింది ఏపీలో రాజీనామా చేసిన వాలంటీర్లకు. అప్పుడేమో వైసీపీ నాయకుల మెప్పు కోసం రాజీనామాలు చేశారు. మరికొందరేమో ఏకంగా వైసీపీనాయకుల తరపున ప్రచారం సైతం నిర్వహించారు.అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వారిని పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు.
అప్పట్లో వలంటీర్ వ్యవస్థను రద్దు చేయలేదు. వైసీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో... విధులకు.. పార్టీల కార్యక్రమాలకు.. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ, వైసీపీ నాయకుల ఒత్తిడితో చాలా మంది వలంటీర్లు ఆయా పదవులకు రాజీనామా చేశారు. మళ్లీ వైసీపీనే వస్తుందని.. అప్పుడు మిమ్మల్ని చేర్చుకోవాలంటే.. ఇప్పుడు రాజీనామా చేయాలంటూ.. నాయకులు ఒత్తిడి పెంచారు. దీంతో దాదాపు లక్షమందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు.
దీంతో ఇప్పుడు రాజీనామా చేసిన వలంటీర్లు.. తల్లడిల్లుతున్నారు. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గామని..తమను విధుల్లోకి తీసుకోవాలని.. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు వంటివారిని కలిసి విన్నవిస్తున్నారు. అయితే.. వీరు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. అప్పట్లో మేం రాజీనామాలు చేయొద్దని చెప్పాం.. మీరు వినలేదు.. కాబట్టి.. ఇప్పుడు పరిస్థితి మా చేతుల్లో లేదని నిమ్మల వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి అచ్చెన్న అయితే.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లారు. అప్పట్లో మీతో రాజీనామాలు చేయించిన వారిపై ముందు పోలీసు స్టేషన్లో కేసులు పెట్టి రావాలని ఆయన ఆదేశించారు. ఇలా చేసిన వారిని మాత్రమే తిరిగి వలంటీర్లుగా తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.వలంటీర్ల వ్యవహారంలో మంత్రులు తలకోమాట చెప్పడంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చివరకు ఈవిషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.