విశాఖ వేదికగా జీ-20 సదస్సు ప్రారంభం
విశాఖ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన జీ`20 సమావేశం ఘనంగా ప్రారంభమైంది. విశాఖలోని రాడిసన్ బ్ల్యూ హోటల్లో తొలి రోజు జరిగిన సదస్సుకు 14 సభ్యదేశాలు, 8 అతిథి దేశాల నుంచి 10 అంతర్జాతీయ సంస్థల నుండి యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేక సాంస్కృతిక బృందాలతో విదేశీ అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ సదస్సులో తొలి రోజు ఆయా దేశాల నుంచి ప్రతినిధులంతా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులు ఏ విధంగా అమలు చేయాలని అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్థిక నగరాల అభివృద్ధితో సుస్థిర మైన పట్టణాభివృద్ధి సాధ్యపడుతుందనే అనే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. జీ-20 దేశాలకు భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు నినాదంతో పని చేయాలని పిలుపు ఇచ్చింది. దీనికి అనుగుణంగా జీ-20 మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి కార్యక్రమం రూపొందింది. పట్టణ ప్రాంతాల్లో సుస్థిర సంపూర్ణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి అమలు చేయాల్సిన చర్యలను చర్చల ద్వారా రూపొందించాలన్న లక్ష్యంగా వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది.