అచ్చెన్నపై వైసీపీ స్కెచ్..?

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీలో రాజకీయ హీట్ పీక్స్ కు చేరింది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలోని అతిరథమహారథుల ఓటమే టార్గెట్ గా అధికార, విపక్షాలు ప్లాన్స్ గీస్తున్నాయి. టీడీపీకి కంచుకోటలా భావించే ఉత్తరాంధ్రలో సైకిల్ స్పీడుకు బ్రేకులు వేయడంపై వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో .... గట్టి అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. అచ్చెన్నపై దువ్వాడ వాణి పేరును వైసీపీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి టెక్కలిలో పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అచ్చెన్నపై పోటీకి దువ్వాడ శ్రీనివాస్ కరెక్టని భావించిన జగన్ సైతం.. ఆయన పేరును స్వయంగా ప్రకటించారు. అయితే అంతలోనే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దువ్వాడ వాణి పేరును స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వయంగా భర్తే , భార్యను అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక అసంతృప్తికి చోటు లేకుండా పోయింది.
ఇంతకూ అచ్చెన్నపై వాణిని ఎందుకు వైసీపీ అధిష్టానం బరిలోకి దింపుతోంది. వ్యక్తిగత అర్హతలతో పాటు టెక్కలి నియోజకవర్గంలో కళింగుల ఓట్లు ఎక్కువ శాతం ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన ఓ మహిళకు టికెట్ ఇస్తే క్యాస్ట్ పాలిటిక్స్తో పాటు మహిళ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనేది వైసీపీ లెక్కల్లో భాగంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే అచ్చెన్నాయుడిని ఓడించే అవకాశాన్ని ఈసారి వదులుకోవద్దనే వైసీపీ ఆలోచన. ఆ భావనతోనే ఈ ఎత్తు వేసినట్లుగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
కారణాలు పరిశీలిస్తే.. దువ్వాడ శ్రీనివాస్ కు.. సీనియర్ నేతగా పేరుంది. మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే వ్యక్తిగత ఓటు బ్యాంకు లేదని పార్టీ హైకమాండ్ గ్రహించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ వాణి ఆధ్వర్యంలోనే నడుస్తాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. గతంలో జగన్ ను కలిసినప్పుడు సైతం టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిత్వం విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ.. ఇప్పుడు భార్య వాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలపటం వల్ల.. ఆకుటుంబానికి పార్టీ ఇచ్చే ప్రాధాన్యం .. జిల్లా వైసీపీ శ్రేణులకు అర్థమవుతుందన్నది కూడా ఓవాదనగా వినిపిస్తోంది. టెక్కలి నియోజకవర్గ వైసీపీలో గ్రూపుల బెడద కూడా అధికంగా ఉంది. ఈ ఒక్క పావుతో విబేధాలకు హైకమాండ్ చెక్ చెప్పిందన్న భావన వ్యక్తమవుతోంది.






