డబ్ల్యూటీఐటీసీ, యూనివర్శిటీ ఆఫ్ సిలికానాంధ్ర మధ్య కీలక ఒప్పందం
తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు, స్టార్టప్లకు అంతర్జాతీయ అవకాశాల కోసం కృషి చేస్తున్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) మరో కీలక అడుగు ముందుకేసింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా తెలుగు భాష సంస్కృతి, ఉన్నత విద్యారంగాల్లో కృషి చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మక్తల, సిలికానాంధ్ర యూనివర్శిటీ ప్రొవోస్ట్ రాజు చామర్తి ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు అమెరికాలోని వీసాలు, విద్యాభ్యాసంతో కలిసి పనిచేయడంతో తెలుగు విద్యార్థులకు టెక్నాలజీతో సహా అనే అంశాల్లో అవకాశాలు విస్తృతం కానున్నాయి. భారతదేశ సంస్కృతి, కళలు, నైపుణ్యాలు పరిరక్షించడంతో పాటు విశ్వవ్యాప్తం చేసేందుకు సిలికానాంద్ర కృషి చేస్తుంది. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటేషనల్ లింగిస్టిక్ వంటి కంప్యూటర్ కోర్సులను సిలికానాంధ్ర ఇప్పటికే ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో దిలీప్ కొండపర్త్, సాయి కందుల, శివ పరమి, నిరంజన్ నందిమండలం, కిషోర్ గంధం తదితరులు పాల్గొన్నారు.