రెజ్లర్లు వర్సెస్ కేంద్రం..
భారతీయ రెజ్లర్ల పోరాటం మరింత ఉధృతమవుతోంది. లైంగిక వేధింపులకు గురిచేసిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ నెలల తరబడి ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు.. తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. న్యాయంకోసం పోరాడుతుంటే, తమతో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాయమన్న రెజ్లర్లు.. తమ గోడును ప్రధాని, రాష్ట్రపతి వినిపించుకోవడం లేదని ఆక్షేపించారు. అంతేకాదు.. న్యాయం కోరుతున్న తమపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేశారని ఆరోపించారు.
తాము సాధించిన పతకాలే తమ ఆస్తన్న రెజ్లర్లు.. ఇప్పుడు ఈ పతకాలు ఎందుకు సాధించామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. తమకన్నా బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్... కేంద్రానికి ఎక్కువయ్యారా అని ప్రశ్నించారు. న్యాయపోరాటం చేస్తుంటే, తమపై ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని నిలదీశారు. బ్రిజ్ భూషణ్ అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
భారత క్రీడాకారుల ఆందోళనకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన కనిపిస్తోంది. కేంద్రం చాలా అహంకారంతో వ్యవహరిస్తోందని, రెజ్లర్ల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. దేశానికి పతకాలు తెచ్చి కీర్తి,ప్రతిష్టలు సంపాదించి పెట్టిన రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కేజ్రీవాల్ మండిపడ్డారు. పలువురు జాతీయ స్థాయి నేతలు రెజ్లర్ల పోరాటానికి మద్దతు పలికారు. వివిధసంఘాలు.. క్రీడాకారుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయి.
దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి, గాయాలు తగిలినా ఓర్చుకుంటూ.. పతకాల సాధనే థ్యేయంగా ముందుకెళ్తున్న క్రీడాకారుల పట్ల కేంద్రం ఎందుకంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ ఎంపీకోసం.. క్రీడా ప్రపంచాన ్ని పణంగా పెట్టే స్థాయికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ దిగజారిందా? ఎన్డీఏలోని మిత్రపక్షాలు సైతం ఎందుకు సైలెంటుగా ఉంటున్నాయి. ఇప్పుడిదే ప్రశ్న.. భారత ప్రజానీకాన్ని ఆలోచనలోకి నెడుతోంది.
ఇక భారత రెజ్లర్ల ఆందోళనలు.. విదేశాల్లో దేశం పరువును దెబ్బతీస్తున్నాయని చెప్పవచ్చు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు .. న్యాయం చేయాలంటూ దేశం గర్వించదగిన క్రీడాకారులు ఆందోళనకు దిగడం అంతర్జాతీయంగా దేశప్రతిష్టను మంటగలుపుతోంది. ఆరోపణలపై సమగ్రదర్యాప్తు జరిపి , రిపోర్టులను బట్టి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఎందుకీ సమస్యను ఇంతలా కేంద్రం సాగదీస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖేలో ఇండియా అనడం కాదు.. క్రీడాకారిణుల సమస్యలు పట్టించుకోవాలని పలువురు మాజీ క్రీడాకారులు .. కేంద్రానికి సూచిస్తున్నారు.