ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదు: విజయనగరం ఎంపీ బెల్లాన
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్తో అవసరం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి కేంద్రంలో లేదని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో 21 మంది లోక్సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులం పోరాటం చేస్తూనే ఉన్నామని ఆయన తెలియజేశారు. సోమవారం నాడు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తితిదే అధికారులు ఎంపీకి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం ముగిసిన తర్వాత ఆలయం బయట మీడియాతో మంత్రి మాట్లాడారు.
‘‘దేశంలో బీజేపీ చాలా బలంగా ఉంది. మన అవసరం వాళ్లకు ఏమాత్రం లేదు. వాళ్లకు 300 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. దీని వల్ల మనం ఎంత చెప్పినా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు. అయినా సరే మేం పోరాటం చేస్తూనే ఉన్నాం. అది కొనసాగుతూనే ఉంటుంది కూడా. అది మా విధానం, విధి కూడా’’ అని మంత్రి తెలిపారు.