భారతీయ అమెరికన్ షెఫాలీకి కీలక పదవి.. బైడెన్ నిర్ణయాన్ని ఆమోదించిన సెనేట్
భారతీయ అమెరికన్ షెఫాలీ రజ్దాన్ దుగ్గల్కు కీలక పదవి కట్టబెట్టాలనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయానికి సెనేట్ ఆమోదం లభించింది. నెదర్లాండ్స్లో అమెరికా రాయబారిగా షెఫాలీని బైడెన్ నామినేట్ చేశారు. దీనికి తాజాగా అమెరికన్ సెనేట్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే నెదర్లాండ్స్లో అమెరికా రాయబారిగా షెఫాలీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాశ్మీరీ పండిట్ అయిన షెఫాలీ (50).. హరిద్వార్లో జన్మించారు. ఆమెకు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబంతో అమెరికాలోని పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ వచ్చి స్థిరపడింది. వృత్తి రీత్యా లాయర్ అయిన షెఫాలీ ప్రస్తుతం అమెరికాలో అధికార డెమోక్రాట్ పార్టీ పాలిటిక్స్లో కీరోల్ పోషిస్తున్నారు. గతంలో హ్యూమన్ రైట్స్ వాచ్ శాన్ఫ్రాన్సిస్కో కమిటీ, వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ లీడర్షిప్ అండ్ క్యారెక్టర్ కౌన్సిల్ సభ్యురాలిగా సేవలు అందించిన ఆమె.. యునైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మెమోరియాల్ మ్యూజియం కౌన్సిల్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. షెఫాలీకి కీలక పదవి దక్కడంపై భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.