శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుట్టింది. సోమవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. నేడు ధ్వజారోహణంతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 5 వరకు ఉదయం, రాత్రి వేళ్లలో వాహన సేనలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకుర్పారణ కార్యక్రమంలో భాగంగా వేదపండితులు, అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా భూమిపూజ, పుట్టమట్టి సేకరించి ఆ మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అంకురింపజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకును బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.