న్యూజెర్సీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అమెరికాలోని న్యూజెర్సీలో జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. భారత ప్రవాసీ కాంగ్రెస్ ఈ వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీన అమెరికా చేరుకుంటారు. ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ కృషి, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు తదితర అంశాలపై ఆయన ప్రసంగిస్తారు. అనంతరం జూన్ 4న న్యూయార్క్ నగరంలో జాకబ్ జావిట్ సెంటర్లో భారత ప్రవాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 5వేల మందితో ఒక బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అమెరికా చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.