తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమం, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ తీర్మానించింది. ఆంగ్ల మాధ్యమం, ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డిలు సభ్యులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మౌలిక వసతుల కోసం మన ఊరు మన బడి కార్యక్రమం కింద రూ.7,289 కోట్లు కేటాయించింది. రానున్న శాసనసభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.