ధనిక రాష్ట్రంలో భూములు అమ్మకాలు...
ఆవిర్భావంతోనే ధనికరాష్ట్రం తెలంగాణ. పూర్తిస్థాయి మిగులుబడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రంలో.. సీఎం కేసీఆర్ పలు సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు. రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు సహా పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. అయితే ఆ సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అంటే ఏముంది ధనిక రాష్ట్రం కదా.. ఆదాయం వస్తోంది అందులో నుంచి ఖర్చు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ సంక్షేమపథకాల అమలుకు తగినన్ని నిధులు ఖజానాలో లేవు. అప్పులు చేయడం సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోంది. అంటే అప్పు చేసి పప్పుకూడు తిన్నట్లుగా ఉంది పరిస్థితి.
మరి సంక్షేమ పథకాల అమలు ఎలా? వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చే ఈపథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే వేలకోట్లను సమీకరించేందుకు.. ప్రభుత్వ భూముల అమ్మకం చేపట్టింది. ఎక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థల భూములు కనిపించినా.. వాటిని వెంటనే అమ్మకానికి పెడుతోంది. అంతే కాదు.. భూముల అమ్మకాలకు చాలా రెస్పాన్స్ వస్తోందని గర్వంగా ప్రకటిస్తోంది. అంటే వేల ఎకరాల ప్రభుత్వ భూములు..ప్రైవేటు పరం అవుతున్నాయి.
ఇప్పటివరకూ ఖాళీగా ఉన్న భూములు అయిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి... ప్రభుత్వ కార్యాలయాలపై పడింది. ఇంకేముంది వాటన్నింటిని ఓచోట చేరిస్తే... ఆ విలువైన భూములను, భవనాలను అమ్మి సొమ్ముచేసుకోవచ్చన్నది ప్రభుత్వం అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ నోట ట్విన్ టవర్స్ మాట వినిపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములున్నాయి. వాటికి మార్కెట్ ధర కూడా వందలకోట్లలో ఉంది. వాటన్నింటినీ ఓచోట చేర్చి ఆ భవనాలతో పాటు భూములను అమ్మి, ఆడబ్బులతో సంక్షేమపథకాలు అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అవసరానికి ప్రభుత్వ భూములు అమ్మకం చేపట్టి, ఆ నిధులు తెచ్చుకోవడం.. సంక్షేమ పథకాలు అమలు చేయడం సంగతి బాగానే ఉంది. హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందుతోంది ... భవిష్యత్తులో పెద్ద కంపెనీలు వందల ఎకరాలు కావాలి.. పెట్టుబడులు పెడతామంటే పరిస్థితి ఏంటి..? ఆ కంపెనీలకు భూ పంపిణీ ఎలా చేస్తారు..? ప్రైవేటు నుంచి కొని భూములు ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అయినా ఆదాయం సముపార్జనకు భూముల అమ్మకం తప్పా ఇంకే మార్గం లేదా? అంటే.. చాలా మార్గాలున్నాయని.. అయితే... ఉన్నపళంగా ఆదాయం కావాలన్న మనస్తత్వమే ఈపరిస్థితికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.