గెలుపుగుర్రాలకే టికెట్లు..
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులేస్తోంది. టికెట్లు కేటాయింపుల్లో బంధుప్రీతి, అనుచర గణానికి టికెట్లు ఇప్పించుకోవడం లాంటి వాటికి చెక్ చెప్పాలని యోచిస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం నియోజకవర్గాల వారీగా ఏయే అభ్యర్థులకు గెలుపు ఛాన్స్ ఎంతవరకూ ఉందన్న విషయంపై సర్వే జరిపి, కార్యకర్తల మనోగతాన్ని పరిగణనలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని భావిస్తోంది.
సీనియర్లు, జూనియర్లు అనే దాంతో సంబంధం లేకుండా పార్టీ విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఇప్పటికే కొందరు సీనియర్లకు కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో మాత్రం టికెట్ రాని సీనియర్లకు తగినంత గౌరవం ఉంటుందని.. పార్టీ పదవుల పంపిణీలో ప్రాధాన్యమిస్తామంటూ భరోసా ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాదు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవకాశాలిస్తామని చెబుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కొందరు పార్టీలో పెద్ద నాయకులైనప్పటికీ వరుసగా ఓడిపోవడమే కాకుండా, అక్కడ ఓట్ల తేడా కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. మళ్లీ పోటీ చేసినా ఇదే పరిస్థితి. కొందరు ఎన్నికలప్పుడు మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తారు. వీరికి మళ్లీ టికెట్ ఇచ్చినా పాత పరిస్థితే పునరావృతమవుతుంది. కొన్నిచోట్ల ఇద్దరు బలమైన అభ్యర్థులున్నారు. వారి మధ్య విబేధాల వల్ల గతంలో వ్యతిరేక ఫలితాలొచ్చాయి. ఇప్పుడు ఇద్దరితో చర్చించి ఓ అవగాహనకు రావడం ద్వారా రానున్న ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే చాలా వరకు నియోజకవర్గాలకు సంబంధించి ఇలాంటి కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం. ఎక్కువ చోట్ల కొత్త అభ్యర్థులకే ప్రాధాన్యమిచ్చే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సమస్యలున్న నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదికలు, పార్టీలోని ముఖ్య నాయకులకు ఉన్న అవగాహన ఆధారంగా ఎక్కడెక్కడ ప్రత్యామ్నాయం అవసరం అన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా తరచూ సర్వేలు చేయడం, అభ్యర్థి విషయమై.. ఓ నిర్ణయానికి రావడం, అక్కడ సీనియర్ నాయకులుంటే వారికి నచ్చజెప్పడం.. ఇలా కసరత్తు సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.