వారి పోరాటాలు చిరస్థాయిగా: కేసీఆర్
మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నామని, వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వంధనం స్వీకరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని అన్నారు. అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందన్నారు. దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారిందన్నారు. ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోంది. బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ మారిందన్నారు.
రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించాం. గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్ వన్గా నిలిచాం. గ్రామీణ జీవన విధానంలో ఆగ్రస్థానంలో నిలిచాం. 11.1 శాతం వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నాం. దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచింది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోంది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపర్చాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. 2022`23లో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం గండి కొట్టింది. కేంద్ర అసమర్థ పాలన వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపండి. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. కేంద్ర పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్వేష రాజకీయాలతో నీచ ఎత్తుగడలకు పాల్పడుతున్నారు అని విమర్శించారు.