శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద బాధ్యత
హీరోల కుటుంబాల నుంచే కాదు, నిర్మాతల కుటుంబాల నుంచి కూడా ఈ మధ్య హీరోలొస్తున్నారు. అంతేకాదు, ఆల్రెడీ నిలదొక్కుకున్న వాళ్లు ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నట్లైతే వారి కుటుంబంలోని వాళ్లు కూడా వారి సపోర్ట్ తో తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. రీసెంట్గా దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా వచ్చి తానేంటో నిరూపించుకున్నాడు.
ఇప్పుడు మరో నిర్మాత కుటుంబం నుంచి మరో కొత్త హీరో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. అఖండ సినిమతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి బావ మరిది సాయి హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. సాయిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను కూడా రవీందర్ రెడ్డినే తీసుకున్నాడు.
ఈ సినిమాకు డైరెక్టర్ గా ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించాడు. ఓ న్యూ ఏజ్ డ్రామాతో సాయిని శ్రీకాంత్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. కొత్త బంగారు లోకం సినిమాతో మొదటి ఛాన్స్ లోనే మంచి డైరెక్టర్ అనిపించుకున్న శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత వరుణ్ తేజ్ ను ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
తర్వాత మహేష్, వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, నారప్ప తీశాడు. ఇప్పుడు మళ్లీ సాయి లాంటి యంగ్ హీరోని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నాడు. మరి మిర్యాల రవీందర్ నమ్మకాన్ని శ్రీకాంత్ అడ్డాల ఎంతవరకు నిలబెట్టుకుంటాడు? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూన్ 2న రిలీజ్ చేయనున్నారు.