కోవిడ్ వైరస్ తగ్గుతున్న వేళ.. పెరుగుతున్న ఇళ్ళ విక్రయాలు
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సిన్ల జోరుతో, మరోవైపు ప్రభుత్వం అన్నీ సంస్థలకు అనుమతులను ఇవ్వడం వంటివి రియల్ ఎస్టేట్లో కూడా జోరు వస్తుండటం కనిపిస్తోంది. ప్రజలు కూడా కరోనా కష్టాల నుంచి తేరుకుంటున్నారు. సొంతింటివైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఇళ్ళ కొనుగోళ్ళు జోరు పుంజుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్`జూన్) వార్షికంగా క్రితం ఏడాది కాలంతో పోలిస్తే రెండిరతలు పెరిగినట్టు ఇక్రా తెలిపింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం లోని విక్రయాలతో పోలిస్తే 19 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2021 జనవరి` మార్చి)లో 84.7 మిలియన్ చదరపు అడుగుల ఇళ్లు అమ్ముడుపోయాయని.. 2011`12 సంవత్సరం నుంచి చూస్తే రెండో అత్యధిక త్రైమాసికం అమ్మకాలుగా ఇక్రా తన నివేదికలో తెలిపింది. ఈ అధిక బేస్ కారణంగా.. జూన్ త్రైమాసికంలో విక్రయాల క్షీణత కనిపిస్తోందని వివరించింది.
నివాస గృహాల విక్రయాలు 2020 జూన్ త్రైమాసికంలో 33.7 మిలియన్ చదరపు అడుగుల మేరే అమ్ముడుపోవడం గమనార్హం. ఆ విధంగా చూస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం కొనసాగుతుండడం, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడం వల్ల స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి ఇళ్ల విక్రయాలు ఇంకా పుంజుకుంటాయని ఇక్రా అంచనా వేసింది. అంతర్గతంగా డిమాండ్ ఈ పరిశ్రమలో నెలకొని ఉన్నట్టు తెలిపింది. కనిష్టాల్లో రుణాల రేట్లు, కార్యాలయంతోపాటు ఇంటి నుంచి కూడా పనిచేసుకోగలిగిన వాతావరణం వల్ల ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని పేర్కొంది. ఏదీ ఏమైనా ఇళ్ళ కొనుగోలుకు ప్రజలు ముందుకు వస్తుండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి.