సోనియాతో భేటీ కానున్న గెహ్లాట్.. గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందా?
రాజస్థాన్ వేదికగా కాంగ్రెస్లో హైడ్రామా జరుగుతోంది. దీని వెనుక ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారని, ఆయన ప్రోద్బలంతోనే ఈ తిరుగుబాటు జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ పడకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భావిస్తోంది. ఇదే విజ్ఞప్తి చేస్తూ సోనియాకు కాంగ్రెస్ ప్యానెల్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియాతో గెహ్లాట్ సమావేశం కానున్నారు. బుధవారం నాడు ఆమెతో సమావేశమై రాజస్థాన్ రగడ గురించి గెహ్లాట్ చర్చిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తను పోటీ పడతానని గెహ్లాట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్లో యువనేత సచిన్ పైలట్ను సీఎం చేయాలని పార్టీ భావించింది. అయితే ఇది గెహ్లాట్కు ఇష్టం లేదు. దీంతో ఆయన మద్దతు దారులు తిరుగుబాటు చేశారు. పైలట్ను సీఎం చేయొద్దంటూ మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు కూడా చేశారు.
సీఎంగా గెహ్లాట్ సూచించిన వ్యక్తినే ఎంపిక చేయాలని, 2020 జూన్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం జరిగిన సమయంలో పార్టీకి అండగా నిలిచిన 102 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని సీఎంగా ప్రతిపాదించాలని వారు హైకమాండ్కు షరతులు విధించారు. రాజస్దాన్లో రాజకీయ పరిణామాలను చక్కదిద్దేందుకు, గెహ్లాట్, పైలట్ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ పరిశీలకులుగా మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్లను కాంగ్రెస్ నియమించింది. వీళ్లు కూడా తమ నివేదికలను పార్టీ హైకమాండ్కు అప్పగించారు. ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియాతో గెహ్లాట్ సమావేశం కానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజస్థాన్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేతలు.. నేరుగా సోనియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో సోనియాను కలిసిన అనంతరం ఆమెను కన్విన్స్ చేసి, అధ్యక్ష ఎన్నికల్లో నిలబడాలని గెహ్లాట్ ఆశిస్తున్నారు. మరి సోనియా గాంధీ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది తెలియాలంటే సమావేశం ముగిసే వరకు ఆగాల్సిందే.