తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు సూపర్ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు బోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు బోర్డు లేఖ రాసింది. విశాఖపట్నం- విజయవాడ- శంషాబాద్, విశాఖపట్నం- విజయావాడ - కర్నూలు మార్గాల్లో ఈ సర్వే జరగనుంది. ఈ రెండు లైన్ల పరిధిలో మొత్తం 942 కి.మీ మార్గంలో రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఆయా మార్గాల్లో సూపర్ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే తర్వాత ప్రాజెక్టుపై అడుగులు ముందుకు సాగనున్నాయి. ఈ రైల్వే లైన్ల అంశాన్ని కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్టవ్ను కలిసి లేఖలు అందజేశారు. ఈ రైల్వే లైన్ల ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధిని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.