కర్ణాటకలో రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ పోస్టర్లు చించివేత.. బీజేపీ పనే అంటున్న కాంగ్రెస్!
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక చేరుకోనుంది. ఈ నెల 30న చామరాజనగర్ జిల్లా నుంచి కర్ణాటకలోకి రాహుల్ వెళ్తారు. ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలుకుతూ గుండ్లుపేట్ ప్రాంతంలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే వీటిని కొందరు చించివేశారు. యాత్రకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన 40 పోస్టర్లను ఇలా చించివేయడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండ్లుపేట్ హైవేపై ఏర్పాటైన ఈ పోస్టర్ల అన్నింటినీ బీజేపీ కార్యకర్తలే చించివేసి ఉంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, కేరళలో రాహుల్ భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరింది. గురువారం నాడు కేరళలో నీలాంబర్లో ఆయన పర్యటిస్తున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాహుల్ యాత్ర ఇక్కడకు చేరుకోవడం పార్టీకి మరింత ఊపునిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటకలో రాహుల్ యాత్రను విజయవంతం చేసేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సహా మాజీ సీఎం సిద్ధరామయ్య తదితర సీనియర్ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేసి రాహుల్ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.