మధ్యప్రదేశ్లో కూడా మాదే గెలుపు.. 150 సీట్లు గ్యారంటీ: రాహుల్ గాంధీ
కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అన్ని పార్టీల కన్ను మధ్యప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడింది. కర్ణాటకలో గెలిచినట్లే ఇక్కడ కూడా విజయ దుందుభి మోగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక్కడ కూడా తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి తాము అంతర్గత సమీక్ష నిర్వహించామని ఆయన చెప్పారు. కర్ణాటకలో 136 సీట్లు గెలిచామని, మధ్యప్రదేశ్లో 150 సీట్లు గెలుస్తామని అన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ కూడా ఉన్నారు. వీరందరూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలనే చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు 4 నెలల సమయం మాత్రమే ఉందన్నారు. తాము ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ భవిష్యత్తు, ప్రధాన సమస్యలపై చర్చించామని పేర్కొన్నారు.