మాస్ చిప్ చేతికి అమెరికా కంపెనీ
హైదరాబాద్కు చెందిన మాస్చిప్ టెక్నాలజీస్ అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్నాటిక్స్ ఇంక్. అనే కంపెనీని కొనుగోలు చేయనుంది. సాఫ్ట్నాటిక్స్కు మన దేశంలోని పుణె, అహ్మదాబాద్లో కార్యాలయాలు ఉన్నాయి. వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ విభాగంలో ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఏడాదిలో ఈ సంస్థ 4.73 మిలియన్ డాలర్ల టర్నోవర్ను నమోదు చేసింది. దీన్ని సొంతం చేసుకోవటం వల్ల ఇంజినీరింగ్ నైపుణ్యం, వినియోగదార్లు, ప్రపంచ స్థాయి సామర్థ్యమన్న నాయకత్వం, మానవ వనరులకు తమకు లభిస్తాయని మాస్చిప్ టెక్నాలజీస్ పేర్కొంది. సాఫ్ట్నాటిక్స్ను 17.25 మిలయన్ డాలర్లకు ( దాదాపు రూ.141 కోట్లు) కొనుగోలు చేసేందుకు మాస్చిప్ టెక్నాలజీష్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 47.4 శాతానికి దశల వారీగా నగదు చెల్లిస్తారు. మిగిలిన 52.6 శాతం విలువకు 1,14,52,498 మాస్చిప్ టెక్నాలజీస్ షేర్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో కేటాయిస్తారు. రూ.2 ముఖ విలువ ఒక్కో మాస్చిప్ షేరును రూ.65.22 ధరకు జారీ చేయనున్నట్లు మాస్చిప్ టెక్నాలజీస్ వెల్లడించింది. వచ్చే మూడు నెలల కాలంలో సాఫ్ట్ నాటిక్స్ను కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తవుతుందని మాస్ చిప్ వెల్లడించింది.