కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. మేం కూడా సిద్ధమే
అనైతిక పొత్తులతో ప్రభుత్వాలను పడగొట్టే పనిలో బీజేపీ ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి తలసాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి స్వాగతం పలికానన్నారు. సీఎం తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని, ఎవరు ఎవరికీ భయపడరని అన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ అభివృద్ధి చూడాలన్నారు.
దేశ అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా ముందుస్తుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు. మేం అడుగుతున్నాం. దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు రావాలి. అన్నీ కలిపి ఒకేసారి నిర్వహిద్దాం. దేనికైనా మేం సిద్దమే. దుమ్మంటే ఎన్నికల్లో తలపడాలి అని సవాల్ విసిరారు.