క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తర్వాత ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది నిర్మాణ రంగమేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ తన దక్షత, సమర్థతతో రాష్ట్రంలో 6 నెలల్లో విద్యుత్ కొరతను తీర్చారన్నారు. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. హైదరాబాద్కు వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి పొందుతున్నారని, కానీ ఇక్కడి యువత మాత్రం గల్ఫ్కు వలస పోతున్నారని అన్నారు. చేసే పనిలో తేడా లేకపోయినా కుటుంబాలకు దూరంగా వెళ్తున్నారని లోపం ఎక్కడుందని ప్రశ్నించారు.
నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, ఇక్కడే ఉపాధి కల్పించేలా చొరవ తీసుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. కార్మికులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్ష అందించేందుకు ముందుకొస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఒక ప్రయత్నం చేద్దామని సక్సెస్ అయితే దాన్ని కొనసాగిద్దామన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ పరిధిలో తొలుత దాన్ని ప్రారంభించాలని, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు దాన్ని విస్తరించాలని కోరారు.