నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం రోజురోజుకీ విస్తరిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ది కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో క్రెడాయ్ను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరంలోని నీటీ అవసరాలు, సుందరీకరణ లక్ష్యంలో భాగంగానే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. నిర్మాణ రంగంతో పాటు ఫార్మా, పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హైదరాబాద్ ఎదిగింది. ఓఆర్ఆర్ వెలుపల కూడా నగరం భారీగా విస్తరిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 110 చెరువులు ఉన్నాయి. హైదరాబాద్లో పడిన వర్షం నీరు 94 శాతం మూసీలోకే వెళ్తుందని అన్నారు.