మోసం చేసేందుకు... కొత్త మేనిఫెస్టో తో ముందుకు
ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన హయాంలో రైతులకు రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. మహిళలను, యువతను, రైతులను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పథకాలను విమర్శించి, ఎగతాళి చేసిన వ్యక్తే ఇప్పుడు పేరు మార్చి, అవే పథకాలను పెడుతామంటున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలు మాయలోళ్ల మాటలు నమ్మి, వారి గారడీలో పడొద్దని సూచించారు. మహిళలు, యువతకు తమ వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.