అమరావతిలో వెంకన్న ఆలయం... వైభవంగా మహాసంప్రోక్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వం అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు కేటాయించగా దీనిలో టీటీడీ తొలి విడతగా రూ.35 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టింది. ఈ సస్త్రందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. ఇంకా 1200 ఆలయాల నిర్మించాల్సి ఉందని తెలిపారు. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ పూర్తయిన నేపథ్యంలో నేటి నుంచి వెంకటపాలెం ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నారు.