Radha Spaces ASBL

తానా ఆధ్వర్యంలో ‘కురుక్షేత్ర యుద్ధ విశేషాలు’ అంశంపై సాహితీ ప్రసంగం

తానా ఆధ్వర్యంలో ‘కురుక్షేత్ర యుద్ధ విశేషాలు’ అంశంపై సాహితీ ప్రసంగం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' ఆధ్వర్యంలో గత ఆదివారం డిసెంబర్ 12న 'కురుక్షేత్ర యుద్ధ విశేషాలు' అనే అంశంపై సాహితీ ప్రసంగం నిర్వహించారు. న్యూజెర్సీ లోని సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి సాహితీప్రియులు విచ్చేసారు. సాహిత్యరంగంలో అగ్రగణ్యులు, సరస్వతి పుత్రులు, సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ తన ఆధ్యాత్మిక ఉపన్యాసంతో సాహితీ ప్రియులను పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమాన్ని తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి వంశీ వాసిరెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభించి డాక్టర్ మేడసాని మోహన్ ని సభికులకు పరిచయం చేసారు. మేడసాని సాక్షాత్తు సరస్వతీ స్వరూపమని, అటువంటి అవధాన సామ్రాట్ న్యూజెర్సీ రావడం నిజంగా మన అదృష్టమన్నారు. అనంతరం తానా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. శిరీష మాట్లాడుతూ సహస్రావధానాలతోపాటు వందలాది అష్టావధానాలు చేసిన పండితులు మేడసాని గారిని చూస్తుంటే మన తెలుగు సంస్కృతి, సాహిత్యం అమెరికా తరలివచ్చినట్టుందన్నారు.

సాయి దత్త పీఠం నుండి శ్రీ విష్ణు శివ దేవాలయాల ధర్మకర్త రఘు శర్మ శంకరమంచి మాట్లాడుతూ మేడసాని తెలుగు సంస్కృతీ సాహిత్యాల్ని ఔపాసన పట్టిన మేధావి అని, ఈ సాహితీ ప్రసంగానికి ఎంచుకున్న కురుక్షేత్రంలో యుద్ధ విశేషాలు అంశం పండితుల నుండి పామరుల వరకు ఆకర్షంచే విషయం అన్నారు.

తదనంతరం మేడసాని సాహితీ ప్రసంగం ప్రారంభించారు. కురుక్షేత్ర యుద్ధ ప్రసంగ పరిధి చాలా పెద్దది. కానీ అందులో ముఖ్య ఘట్టాలను అనుకున్న సమయంలో అందరికీ అర్ధ్యమయ్యేలా విడమరిచి వివరించారు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, ధర్మరాజు, కర్ణుడు, కృష్ణుడు, అర్జునుడు ఇలా ఒక్కోక్కరు ఎలా వ్యవహారించారు, వాటిని  ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అన్వయించి కళ్లకుకట్టినట్లు మేడసాని చక్కగా వివరించారు. అలాగే సభికులు అడిగిన పలు ప్రశ్నలకు మంచి సమయస్ఫూర్తితో సమాధానాలందించారు.

ఈ సాహితీ కార్యక్రమానికి స్థానిక ప్రతినిధులు ఉపేంద్ర చివుకుల, సూర్యనారాయణ మద్దుల, మంజు భార్గవ, స్వాతి అట్లూరి, బిందు యలమంచిలి, మహేందర్ ముసుకు, జగదీశ్ యలమంచిలి, మధు రాచకుల్ల, మధు అన్న, శరత్ వేట, తదితరులు పాల్గొనడం విశేషం. తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, తానా కమిటీ సభ్యులు రామకృష్ణ వాసిరెడ్డి, శివాని తానా, సుధీర్ నారెపాలెపు, శ్రీ చౌదరి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతమవడంలో తోడ్పడ్డారు. సాయి దత్త పీఠం వారు అందరికీ మహాప్రసాదం ఏర్పాటుచేశారు. దేశం కాని దేశంలో కూడా మన సాహిత్యాన్ని మరిచిపోకుండా అందరికి గుర్తు చేసేలా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి వంశీ వాసిరెడ్డి ని సభికులు అభినందించారు.

తానా మరియు సాయి దత్త పీఠం సభ్యులు మేడసాని ని ఘనంగా సత్కరించారు. చివరిగా తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి వంశీ వాసిరెడ్డి ఈ సాహితీ కార్యక్రమం ఇంత అత్యద్భుతంగా జరగడానికి సహకరించిన తానా కార్యవర్గసభ్యులకు, సాయి దత్త పీఠం రఘు శర్మ శంకరమంచి, మురళి మేడిచెర్ల, అలాగే హాజరైన సభికులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలపి కార్యక్రమాన్ని ముగించారు.

Click here for Photogallery

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :