ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ-హబ్లో ఐటీ శాఖ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ను నిలబెట్టామని తెలిపారు. 2013-14లో హైదరాబాద్లో ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లుగా ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.1.8 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించామని తెలిపారు. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారమేమీ లేదని, మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదన్నారు. దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగాం. హైదరాబాద్ ఐటీ రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకెళ్తోంది. హైదరాబాద్ నగరాన్ని ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగాం అని అన్నారు.
అమెరికాకు చెందిన క్వాల్కామ్, గ్రిడ్ డైనమిక్స్ సంస్థ సహా అనేక కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయి. నగరంలో పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ బాష్ ముందుకొచ్చింది. గూగుల్ కూడా ఇక్కడ అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నగరానికి వస్తోంది. భారత కంపెనీ ఎల్ఐటీ మైండ్ ట్రీ కంపెనీ వరంగల్లో పెట్టుబడులు పెడుతోంది. సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ తెస్తున్నాం. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కేంద్రం ఈ ఏడాది వస్తుంది. మరో రెండేళ్లలో డజోన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ వస్తోంది. ఐటీ రంగం దూసుకెళ్లేందుకు మా బృందం బాగా పనిచేస్తోంది అని తెలిపారు.






