కవచ్ టెక్నాలజీ ఉండి ఉంటే..
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది మృతి చెందారు. పలువురు గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమే కారణంగా భావిస్తున్నారు. పొరపాటున లూప్ లైన్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కోరమాండల్.. గూడ్స్ ను ఢీకొట్టిందని, అందువల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కేంద్రం తెచ్చిన కవచ్ టెక్నాలజీ ఏమైంది..?
కవచ్.. అంటే కవచం.. అంటే రక్షణ అని అర్థం. ఇది భారతీయ రైల్వే ప్రమాద నిరోధక వ్యవస్థ. దీని ద్వారా రెండు రైళ్లు ఒకే ట్రాక్లో వస్తూ ఉంటే... అవి ఆటోమేటిక్గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అలాగే రైళ్లను ఈ టెక్నాలజీ వెనక్కి నడిపిస్తుంది. అందువల్ల రైళ్లు ఢీకొనవు. ఈ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1,455 కిలోమీటర్లు కవర్ అయ్యాయి. మార్చి 2024 నాటికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాల్లో కవాచ్ టెక్నాలజీని అమల్లోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతున్నదాని ప్రకారం ప్రమాదాలను ఆపడానికి రైలు రక్షణ, హెచ్చరిక వ్యవస్థ ఒక ముఖ్యమైన వ్యవస్థ. ఇందులో రైల్వే ఇంజిన్లోని క్యాబ్లో సెట్ చేసిన స్క్రీన్పై ప్రతి సిగ్నలూ కనిపిస్తుంది. రైలు ఎంత వేగంగా వెళ్తుంటే లోకో పైలట్లు స్క్రీన్పై చూస్తారు. ఇది కూడా రైలు ప్రమాదాలు జరగకుండా కొంతవరకూ ఆపుతుంది. సమస్యాత్మక పరిస్థితుల్లో ఈ వ్యవస్థ రైలు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది.
కవచ్ టెక్నాలజీ అనేది... ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీని అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం బడ్జెట్లో ఈ టెక్నాలజీని ట్రాకులకు అమర్చేందుకు కేటాయింపులు చేస్తోంది. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ఒడిశా రాష్ట్రంలో.. ఈటెక్నాలజీ అందుబాటులో లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కవచ్ టెక్నాలజీ అందుబాటులో ఉండి ఉంటే.. ఇంత ఘోరప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నాయి.