సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మినారాయణ.. ఖరారు చేసిన చంద్రబాబు!
కొంతకాలం కిందటే టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ పోటీ చేయబోయే స్థానంపై అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సత్తెనపల్లి నుంచి ఆయన పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు. సత్తెనపల్లి నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా కన్నా లక్ష్మినారాయణను ప్రకటించిన కాసేపటికే ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీంతో ఆయన ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారో అనే ఉత్కంఠకు తెరపడింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మినారాయణ కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్న నేత. దీంతో జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని భావించారు. ముఖ్యంగా గతంలో పోటీ చేసి గెలిచిన గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు స్థానాల్లో ఏదో ఒకదాన్ని ఆయన ఎంచుకుంటారని అనుకున్నారు. ఆయన కూడా పార్టీ హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే.. అక్కడ నిలబడతానని చెప్పుకొచ్చారు. అయితే అన్ని ఈక్వేషన్స్ ను బేరీజు వేసుకున్న అనంతరం కన్నా లక్ష్మినారాయణకు సత్తెనపల్లి స్థానాన్ని ఫైనల్ చేశారు చంద్రబాబు.
సత్తెనపల్లి నుంచి ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను ఓడించాలంటే బలమైన అభ్యర్థి కావాలి. ప్రస్తుతం అక్కడ కోడెల శివరాం ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. ఒకప్పుడు ఇది కోడెల శివప్రసాద్ కంచుకోట. ఆయన మరణానంతరం కోడెల శివరాం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే శివరాంకు పోటీగా మరో ఇద్దరు నేతలు కూడా సీటు ఆశిస్తున్నారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. వీళ్ల సమస్యలను తీర్చడం కంటే కన్నా లక్ష్మినారాయణ లాంటి బలమైన వ్యక్తిని బరిలోకి దింపితే ఏ సమస్యా ఉండదనుకున్నారు చంద్రబాబు. అందుకే ఆయనకు సీటు ఖరారు చేశారు.
సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గంతో పాటు వెనుకబడిన సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కన్నా లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. జిల్లా వ్యాప్తంగా మంచి పట్టుంది. సత్తెనపల్లిలో బలమైన అనుచరగణం ఉంది. దీంతో కన్నా లక్ష్మినారాయణే ఇక్కడి నుంచి బరిలోకి దిగడం కరెక్ట్ అని ఆయన అనుచరులు కూడా భావిస్తున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ లలో ఏ సీటు ఇచ్చినా ఓకే అని కన్నా లక్ష్మినారాయణ కూడా చెప్పారు. దీంతో ఫైనల్ గా సత్తెనపల్లిని ఓకే చేశారు. అయితే కోడెల శివరాం పరిస్థితి ఏంటనేది వేచి చూడాలి.