థర్డ్ వేవ్ కు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోందా?
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ థర్డ్ వేవ్ ముప్పు ఉందని ఇప్పటికే అనేక మంది నిపుణులు, పలు సంస్థల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దీంతో కేంద్రం థర్ఢ్ వేవ్ను ఎదుర్కోవడానికి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది. సెకండ్ వేవ్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో మరోసారి ప్రజల ప్రాణాలు పోకుండా పలు ప్రణాళికలు రచిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో దేశంలో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్ అందక అనేక మంది ఊపిరి ఆగిపోయింది. దీంతో మరోసారి ఈ తప్పు జరగకుండా కేంద్రం మూడు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో మొదటిది ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం. దాని రవాణాకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం. ఇదంతా జూలై చివరి నాటికి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని టాప్ ప్రయారిటిగా ఆక్సిజన్ సప్లైను ఎంచుకుంది..
ఆక్సిజన్ సప్లై విషయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని స్థానికంగానే ఆక్సిజన్ తయారీకి ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. జూలై చివరికల్లా ప్రతి జిల్లాలో ఒకటికి మించి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 1657 PSA ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో PM కేర్ ఫండ్స్ కింద 1051 ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందులో ఈ నెల చివరికల్లా 218 ప్లాంట్లు. జూన్ చివరి కల్లా సిద్ధం కానున్న మరో 400 ప్లాంట్లు.. జూలై చివరికల్లా మరో 433 ప్లాంట్లు సిద్ధం కానున్నాయి. వీటిలో 700 ప్లాంట్లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, 500 ప్లాంట్లను DRDO, మరో 313 ప్లాంట్లను ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేయనున్నాయి..
మరోవైపు.. 150 నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా మార్పులు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్లాంట్లన్ని 2 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయనున్నాయి. వీటితో పాటు లక్ష ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేయడానికి అనుమతులిచ్చింది కేంద్రం. ఇప్పటికే 84వేల 673 కాన్సన్ట్రేటర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంక్ సహాయనిధి నుంచి రానున్న మరో 14 వేల కాన్సన్ ట్రేటర్లు రానున్నాయి. ఈ ప్లాంట్ల నిర్వహణ కోసం టెక్నిషియన్లకు శిక్షణ ఇచ్చే బాధత్యను ఐఐటీ కాన్పూర్, ఇండియన్ నేవీ తీసుకుంది..
ఇక రెండోది ముఖ్యమైన డ్రగ్స్ రవాణాకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం. అంతేగాకుండా రోగుల సంఖ్య పెరిగినా సరిపడేలా అవసరమైన డ్రగ్స్ కొనుగోలుకు టెండర్లు పిలిచేందుకు సమాయత్తమైంది.. దీనిపై ఫార్మా కంపెనీలతో కేంద్రం చర్చించనుంది..
ఇక మూడోది దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను మెరుగు పరచడం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 900 మేజర్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు16 జంబో ఆసుపత్రుల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు వేస్తోంది. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 13 వేల బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. స్టీల్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీల సమీపంలో ఈ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నారు.. ఆక్సిజన్ సప్లై విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ ప్లాంట్ల సమీపంలో నిర్మాణాలు చేపడుతున్నారు..
థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి తీసుకున్న ఈ నిర్ణయాలు జూలై చివరికల్లా అమల్లోకి వచ్చేలా పనులు జరగాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. మరి ఇవి ఈ ఆలోచనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయో లేదో చూడాలి.