హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి : అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి
హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన అమెరికన్ కాన్సులేట్ అమెరికా, భారత్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు దోహదపడుతున్నదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికన్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకే కాకుండా భారత్ నుంచి అమెరికాలో పెట్టుబడులను ప్రోత్సహించడంలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే వాణిజ్యం బాగా పెరిగిందని తెలిపారు. అమెరికా ఫారిన్ పాలసీ బ్రీఫింగ్ సందర్భంగా హైదరాబాద్ లోని కొత్త కాన్సులేట్ గురించి ప్రస్తావించడం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదని వివరించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అమెరికన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్ వీసా కోసమే కాకుండా లక్షలాది మంది తెలుగు వారు వాణిజ్య, పర్యాటక, డిపెండెంట్ వీసాల కోసం అమెరికన్ కాన్సులెట్కు వెళ్తుంటారని తెలిపారు. వీసా, దౌత్య కార్యకలాపాల కోసం భారత్లోని నాలుగు కాన్సులేట్లలో హైదరాబాద్ ఉన్నదే అతి పెద్దదని తేల్చిచెప్పారు.