ఈ నెల 29 నుంచి కెడ్రాయ్ ప్రాపర్టీ షో
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 11వ ప్రాపర్టీ షోని మాదాపూర్లోని హైటెక్స్లో ఈ నెల 29 నుంచి మే 1 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్కు తగ్గ స్థిరాస్తులను డెవలపర్లు ప్రదర్శించనున్నారని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణరావు తెలిపారు. రెరా అనుమతి పొందిన సమీకృత టౌన్షిప్పులు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హరిత ప్రాజెక్టులతో పాటు రిటైల్, వాణిజ్య ఓపెన్ ప్లాట్ల గురించి ఒకే చోట తెలుసుకునే వీలు ప్రాపర్టీ షో కల్పిస్తుందని ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
కోవిడ్ తర్వాత ఈ ఎడిషన్ ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న వ్యక్తుల సరాసరి వయసు 35 సంవత్సరాలుగా ఉందనీ, గతంలో ఇది 50 ఏండ్లుగా ఉండేదని వారు విశ్లేషించారు. హైబ్రిడ్ పని సంస్కృతితో పాటు అపార్ట్మెంట్ల కోసం డిమాండ్ పెరుగుతుందనీ, తక్కువ వడ్డీరేట్లకు గృహ రుణాలను అందిస్తుండటం కూడా రియల్ ఎస్టేట్ పెరుగుదలకు కారణంగా ఉన్నాయని తెలిపారు.