వేగంగా వ్యాపిస్తున్నందున.. ఇది ఎక్కువ రోజులు ఉండదు : మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త
కరోనా ఒమిక్రాన్ వైరస్ కేసులు భారత్ లో జనవరి చివరికి తారస్థాయికి చేరి, ఫిబ్రవరిలో తగ్గుముఖం పడతాయని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్, మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వచ్చే వారంలోనే కరోనా పాజిటివ్ కేసులు గరిష్ఠాలకు చేరతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరి చివరికి తారస్థాయికి చేరి, అనంతరం తగ్గిపోతాయని ముఖర్జీ అభిప్రాయపడ్డారు. దీనికి వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉంది. కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అందుకే ఇది ఎక్కువ రోజుల పాటు కొనసాగబోదు అంటూ తన విశ్లేషణను ముఖర్జీ వివరించారు.
కేసులు ఎక్కువగా వచ్చినా, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉండదన్నారు. దీనికి దేవుడి అనుగ్రహం, టీకాలు ఇవ్వడం, ప్రజారోగ్య చర్యలు దోహదపడి ఉండొచ్చన్నారు. భారత్లో సహజ రోగనిరోధకతకు తోడు టీకాలు ఇవ్వడం మేలు చేసిందన్నారు. ఇతర దేశాల్లో కేసులు భారీగా ఉండడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉండడానికి టీకాలు తగినంత తీసుకోకపోవడమే కారణమని తెలిపారు.