శశిథరూర్ పై గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. గెలిచేది ఖర్గేనే అన్న రాజస్థాన్ సీఎం
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్న ఎంపీ శశి థరూర్ పై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మద్దతు మల్లికార్జున్ ఖర్గేకే అని తేల్చి చెప్పిన ఆయన.. శశి థరూర్ కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని వెల్లడించారు. రాజస్థాన్ కాంగ్రెస్ లి రగడ కారణంగా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి గెహ్లాట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అశోక్ గెహ్లాట్ ఆదివారం నాడు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. మల్లికార్జున్ ఖర్గేకు రాజకీయంలో గొప్ప అనుభవం ఉందని, ఆయన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయగలరని అభిప్రాయపడ్డారు. ఆయన నిష్కళంక చరితుడని, దళిత జాతిలో జన్మించారని చెప్పారు. ఆయనను అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆయన కచ్చితంగా గెలుస్తారని చెప్పారు. అదే సమయంలో శశి థరూర్ గురించి మాట్లాడుతూ.. థరూర్ ఉన్నత వర్గానికి చెందినవారని వ్యాఖ్యానించారు. అయితే పార్టీని బూత్, బ్లాక్, జిల్లా స్థాయుల్లో బలోపేతం చేయడానికి అవసరమైన అనుభవం ఖర్గేకు ఉందని, థరూర్తో ఆయనను పోల్చకూడదని అన్నారు.