వాణిజ్య ఉత్సవ్ ను ప్రారంభించిన సీఎం జగన్
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవం 2021 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. స్టాల్స్ను పరిశీలించిన సీఎం ఉత్పత్తులకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతులు రోడ్ మ్యాప్ బ్రోచర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ పోర్టల్ను ప్రారంభించారు.
ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2020`21లో రూ.1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. 2020`21లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. రెండేళ్లలో రూ.20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.