ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దావోస్‌లో బిజిబిజీగా జగన్...తయారీ హబ్‌గా ఏపీ

దావోస్‌లో బిజిబిజీగా జగన్...తయారీ  హబ్‌గా ఏపీ

దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు. పర్యావరణ హిత తయారీ రంగంలో అవకాశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు, కాలుష్యం లేని ఇంధన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

డబ్ల్యూఈఎఫ్‌తో ప్లాట్‌ఫాం పార్ట్‌నర్‌గా ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్‌, బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ హాన్స్‌ పాల్‌, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతం అదానీలతో సమావేశమై పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ చర్చించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాన్ని పలువురు కొనియాడారు. కొత్త పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా విద్య, వైద్య రంగాలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. 

ఫుడ్‌ హబ్‌గా ఏపీ

దావోస్‌లోని కాంగ్రెస్‌ సెంటర్లో డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లాజ్‌ మాట్లాడుతూ.. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం ఫుడ్‌ హబ్‌గా మారేందుకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితులను తీర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ష్వాప్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగు పరచడంపై శ్రద్ధ పెట్టామని చెప్పారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్‌ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్య రంగాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడప వద్దకే సేవలు అందిస్తున్నామని చెప్పారు.

వైద్య రంగంలో భాగస్వామ్యం కండి - జగన్

దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఏర్పాటు చేసిన వైద్యరంగం సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్యం వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో కాంగ్రెస్‌ సెంటర్లో సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపై  చర్చలు జరిపారు. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతి 2 వేల జనాభాకు వైఎస్సార్‌ క్లినిక్స్‌.. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాస్పత్రులు, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్‌ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకుని, జ్యోతి ప్రజ్వలనం చేసి ఎపి పెవిలియన్‌ను  ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలను తెలియజేసేలా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు.

డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టెయిన్‌బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్‌ ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యం ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై, కాలుష్యం లేని రవాణా వ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై, ఇంధన రంగం భవిష్యత్‌పై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగింది.

ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్‌ చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కి చెప్పారు. లేకపోతే నీటి వనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్‌ స్టోరేజ్‌ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని వివరించారు. విండ్‌, సోలార్‌, హైడల్‌.. ఈ మూడిరటినీ సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని విశదీకరించారు.ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఏపీ చర్యలపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు ప్రశంస

బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) గ్లోబల్‌ చైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సీఎం జగన్‌ సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్‌ డెస్క్‌ విధానం ద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో తూర్పు భాగానికి రాష్ట్రం గేట్‌వేగా మారేందుకు అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇందుకోసం కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం ప్రారంభించామన్నారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ బక్నర్‌ ప్రశంసించారు. నైపుణ్య మానవ వనరులను తయారు చేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతం అదానీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు.  


Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :