మున్సిపల్ సర్వీసులపై యాప్తో పర్యవేక్షణ.. గ్రామాల్లో కూడా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశం
నగరాలు, పట్టణాల్లో మున్సిపల్ సర్వీసుల అభివృద్ధిని ఎప్పటికప్పుడు పరిశీలించాలనే యోచనతో తీసుకువస్తున్న ‘ఏపీసీఎంఎంఎస్ (ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) యాప్’ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ యాప్ నుంచి అందే గ్రీవెన్స్ను పరిష్కరించడం కోసం పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల్లో దీని పనితీరును పరిశీలించి, దాన్ని బట్టి తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సేవలు అందించడంతోపాటు నిర్దేశిత సమయంలోపు అనుమతులు అందేలా చేయడం, అవినీతిని పారద్రోలడమే లక్ష్యంగా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సీఎం జగన్ వెల్లడించారు. మున్సిపల్ శాఖపై సమీక్ష సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.