లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే... సీపీ ఇంట్లో కూర్చోవాలి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రికత్త తలెత్తిన విషయం తెలిసిందే. జనగామ జిల్లాలోని దేవరుప్పల సభలో సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని సంజయ్ను టీఆర్ఎస్ నేతల అడగడంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పోలీసులు అక్కడి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పారు. నా భద్రతను తన కార్యకర్తలే చూసుంటారన్నారు. బీజేపీ కార్యకర్తల తలలు పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. లాండ్ అండ్ ఆర్డర్ చేతకాకుంటే సీపీ ఇంట్లో కూర్చోవాలన్నారు. దాడి ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. లేదంటే గాయపడ్డ కార్యకర్తలను తమ దగ్గరికి తీసుకొస్తానని సవాల్ విసిరారు. జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.