ఎన్టీఆర్పై ప్రత్యేక నాణెం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేస్తున్నందుకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సంతోషం వ్యక్తం చేసింది. ‘నాణెం విడుదల అంశంలో చొరవ తీసుకున్న కేంద్రానికి, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసిన మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని టీడీపీ పొలిట్బ్యూరో తీర్మానం చేసింది. ‘ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన్ను సన్మానించడం అంటే తెలుగు వారందరినీ గౌరవించడమే. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మీకు ధన్యవాదాలు’ అని చంద్రబాబు తన లేఖలో రాసుకొచ్చారు.