కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
గిడ్డంగుల ఏర్పాటు విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కోసం గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 700 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పథకం కింద రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం గిడ్డంగుల సామర్థ్యం 1450 లక్షల టన్నులుగా ఉందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సహకార రంగంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో 2 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆహార పదార్థాల వృథాను తగ్గించేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశంలో ఏటా 3100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండుతుండగా, కేవలం 47 శాతం ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటోందన్నారు.