మహనీయుడు ఎన్టీఆర్ జీవితం స్ఫూర్తిదాయకమని కీర్తించిన నందమూరి బాలకృష్ణ
ఈ రోజు మంగళవారం (జనవరి 18) మహానటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ సందర్శించి నివాళులు అర్పించారు. బాలయ్య తో పాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. తెలుగు వారి గొప్పదనాన్ని ఈ ప్రపంచానికి చాటారు. నాకు తెలిసిన వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఆయనే.
సినిమాల్లో ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన, రాజకీయ పార్టీని పెట్టి, కేవలం 9 నెలల్లోనే అధికార పార్టీని ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఆయన దగ్గరయ్యేలా చర్యలు తీసుకున్నారు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డను అందించిన నాయకుడు. అభినవ భగీరథుడు. తెలుగు గంగను తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చిన వ్యక్తి. జాతీయ పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించిన మహానుభావుడు. ఎన్టీఆర్ గురించి రాయాలంటే సూర్యుని వేలెత్తి చూపించినట్లే అవుతుంది. ఆయన గురించి పాట రాయాలంటే వ్యాసుడు, వశిష్టుడు వల్ల కూడా కాదేమో. తెలంగాణలో 610 జీవోను తీసుకొచ్చారు. స్థానికులకే ఉద్యోగాలకు ఇవ్వాలని ఆ జీవోను తీసుకొచ్చారు. హైదరాబాద్ పాత బస్తీ ప్రజలు అల్లర్లు లేకుండా అక్కడి జీవనాన్ని అందరు సామ్యరసాపూర్వకంగా జీవించే విధంగా తీర్చిదిద్దారు. ఇలా చెప్పుకుంటూపోతే అయన చేసిన ప్రజాభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూపోతే ఈ రోజు మొత్తం సరిపోదు ’’ అన్నారు.