7న ఏపీ కేబినెట్ భేటీ..! ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం..!?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కొత్త కాదు. చాలా కాలం నుంచే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. పైగా జగనే స్వయంగా ఆ మధ్య కీలక ప్రకటన చేశారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని ఒక్కరోజు కూడా వదులుకోబోమని ప్రకటించారు. దీంతో ముందస్తు ఊహాగానాలకు చెక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికల వార్తలు జోరందుకున్నాయి. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో లోక్ సభ ఎన్నికలతో పాటే జరగాల్సి ఉన్నాయి. అంటే దాదాపు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. జగన్ నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు, పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని సహా పలువురు కీలక నేతలతో జగన్ భేటీ అయ్యారు. అదే సమయంలో జూన్ 7న కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రకటన వెలువడింది. దీంతో ఏదో జరగబోతోందనే సంకేతాలు కనిపించాయి.
ముందస్తు ఎన్నికలకు సంబంధించి జగన్ ఢిల్లీలో చర్చలు జరిపారని.. అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించడం వల్లే కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారని కొందరు భావిస్తున్నారు. ఢిల్లీ పరిణామాలను కేబినెట్ సహచరులకు వివిరించడంతో పాటు ప్రభుత్వపరంగా వెంటనే చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు జగన్ వెంటనే కేబినెట్ మీటింగ్ కు ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాక, ముందస్తు ఎన్నికలు ఖాయమైతే పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీని నడిపించాల్సిన బాధ్యత మంత్రులపైనే ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై మంత్రుల అభిప్రాయాన్ని కూడా జగన్ తెలుసుకోనున్నారు.
ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమైతే ఆగస్టు లేదా సెప్టెంబరులో అసెంబ్లీని రద్దు చేస్తారని తెలుస్తోంది. అప్పుడు తెలంగాణతో పాటు డిసెంబర్లో ఎన్నికలు జరగుతాయి. అదే సమయంలో పార్లమెంటుకు కూడా ముందస్తు ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలను పక్కన పెడితే ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలు పక్కా అని చాలామంది అంచనా వేస్తున్నారు. పైకి అలాంటిదేమీ లేదని వైసీపీ నేతలు చెప్తున్నా లోపల మాత్రం అందుకు తగ్గట్లు ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జగన్ కు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ బాగా బలపడిందని సర్వేలు చెప్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టమైంది. మరోవైపు వైసీపీ రోజురోజుకూ వీక్ అవుతోందని సొంత సర్వేలే జగన్ కు తెలియజేస్తున్నాయి. పైగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే గోడదూకి వెళ్లిపోతున్నారు. ఇంకో ఏడాది వరకూ ఉంటే టీడీపీ బలపడడంతో పాటు పార్టీ నేతల ఫిరాయింపులు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. అధికార పార్టీలో నుంచి ఇతర పార్టీల్లోకి నేతలు వెళ్తే అది రాంగ్ సిగ్నల్. అలాంటి అవకాశం ఇవ్వకూడదనుకుంటున్నారు జగన్. వీటన్నిటికీ మించి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. మరో ఏడాదివరకూ రెవిన్యూ లోటును భర్తీ చేసుకుంటూ జీతభత్యాలు ఇవ్వడం కూడా కష్టమేనని తెలుస్తోంది. పైగా ఉద్యోగులు ఇప్పటికే సమ్మె సైరన్ మోగిస్తున్నారు. ఇలాంటి వాటన్నిటినీ తట్టుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మార్గమని జగన్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది.