యాపిల్ అరుదైన ఘనత .. ప్రపంచంలోనే తొలిసారి
కార్పొరేట్ రంగంలోనే టెక్ దిగ్గజం యాపిల్ అరుదైన మైలురాయిని తాకింది. ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్ డాలర్ల (రూ.225 లక్షల కోట్లు) మార్కెట్ విలువ సాధించిన కంపెనీగా నిలిచింది. అమెరికాలో ట్రేడింగ్ ముగియడానికి ముందు ఈ ఘనతను అందుకొంది. కంపెనీ స్థిరంగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం, ఆటోమేటిక్ కార్ల తయారీపై దృష్టి, వర్చువల్ రియాల్టీ మార్కెట్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలు కంపెనీ స్టాక్ విలువను పెంచాయి. 2022 తొలి రోజు ట్రేడింగ్ యాపిల్ షేర్లు ఇంట్రాడేలో అత్యధికంగా 182.88 డాలర్లను తాకింది. ఆ సమయంలో యాపిల్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఆ తర్వాత షేర్ విలువ 182.01 డాలర్లకు తగ్గడంతో మార్కెట్ విలువ మళ్లీ 2.99 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
యాపిల్ సంస్థ 2 ట్రిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరిన సమయంలో మైక్రోసాఫ్ట్ కూడా ఈ క్లబ్లో చేరింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 2.5 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఇక ఆల్ఫాబెట్, అమెజాన్, టెస్లా మార్కెట్ విలువలు 1 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. సౌదీ అరేబియా చమురు కంపెనీ అరామ్కో 1.9 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి. షేర్ల ధరలు మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ను దాటేసింది.