తిరుగులేని విజయాలను సాధించాం: వై.ఎస్. జగన్
ఎన్నికల వరకే రాజకీయాలు, అధికారంలోకి వచ్చాక అంతా మనవారే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ శాంతియుత పోరాటం భారత దేశానికే కాకుండా ప్రపంచ మానవాళకి మహోన్నత చరిత్రగా, తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందన్నారు. మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమైనది. ఈ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించింది. ప్రపంచ ఫార్మా రంగంలో ఇవాళ దేశ మూడో స్థానంలో ఉంది. దేశం దిగుమతుల నుంచి ఎగుమతులకు వేగంగా అడుగులు వేసింది. ప్రపంచంతో పోటీపడి గణనీయంగా అభివద్ధి సాధిస్తున్నామన్నారు.
మంత్రి మండలి నుంచి గ్రామస్థాయి వరకూ సామాజిక న్యాయం తీసుకొచ్చాం. పాలనలో సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశాం. కొద్దిమందికే ప్రయోజనం కల్పించేలా కాకుండా వ్యవస్థనే మార్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. గ్రామ, వార్డు సచివాయాల ద్వారా పౌర సేవలు అందిస్తున్నాం. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారాప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాం. మహిళలకు, సామాజిక, రాజకీయ నియామకాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. 21 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. విద్యారంగంపై రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం. మన సమాజంలోనే సామాజిక స్వతంత్ర పోరాటాలు చాలా ఉన్నాయి. ఆ పోరాటాలు, తిరుగుబాట్లు మాట్లాడకపోయినా దాగని సత్యాలు. ఇవన్నీ నిండు మనసుతో దిద్దుకోవాల్సిన దిద్దుబాట్లు. ఇలాంటి సమాధానాల అన్వేషణే మా ప్రభుత్వం మూడేళ్ల పాలన అని అన్నారు.