ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి ఖరారు!
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ రేపు (18వ తేదీ) ప్రకటించనున్నారు. పంజాబ్ పర్యటన సందర్భంగా ఢిల్లీ సీఎం ఈ ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ కన్వీనర్ అయిన కేజ్రీవాల్ పంజాబ్లోని మెహాలిలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని మీరే నిర్ణయించాలంటూ కేజ్రీవాల్ ఆ అవకాశాన్ని ప్రజలకే ఇచ్చారు. ఇందుకోసం ఓ నంబరు కూడా కేటాయించారు. 96 గంటల్లో ఏకంగా 19 లక్షల మంది అభిప్రాయాలను తెలియజేశారు. వీరిలో 6.5 లక్షల మంది వాట్సాప్ ద్వారా వెల్లడించగా, దాదాపు 2.25 లక్షల మంది వాయిస్ మెసేజ్ ద్వారా, 8 లక్షల మంది వాయిస్ కాల్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. సంగ్రూరు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ ఆప్ చీఫ్ భగవంత్ మాన్ వైపు ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.