
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కొవిడ్ 19 టీకాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలకు సహకరించేందుకు భారతీయ అమెరికన్ వైద్యులు ముందుకు వచ్చారు. వేలాది మంది పౌరులకు టీకాలు వేయడంలో వారంతా సహకరించనున్నారు. న్యూజెర్సీలోని ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమంలో పాల్గొనే భారతీయ అమెరికన్ వైద్యులకు ముకేశ్ రాయ్, అవినాశ్ గుప్తాలు నేతృత్వం వహిస్తున్నారు. ముకేశ్ రాయ్ ఓషన్ టీకా కౌంటీ ఆరోగ్య విభాగంలో ప్రజారోగ్య, ప్రణాళిక, విద్య విభాగానికి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. హృద్రోగ నిపుణుడైన అవినాశ్..భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం ఓషన్ కౌంటీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
కరోనా టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక్కటే విజయవంతం చేయలేదని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సహకారం అవసరమని పేర్కొంటూ ఓషన్ కౌంటీ కమిషనర్ గెర్రీ లిటిల్ గతంలోనే ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై స్పందించిన రాయ్, గుప్తాలు.. వారాంతాల్లోని తీరిక సమయాన్ని ప్రజలకు కరోనా టీకాలు వేసేందుకు స్వచ్ఛందంగా వెచ్చించేలా భారత సంతతి వైద్యులను ఒప్పించారు.