
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. ఫిబ్రవరి 5వ తేదీని కశ్మీర్ అమెరికన్ డే గా ప్రకటించాలంటూ తీర్మానంగా చేయగా, దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ మరో 12 మంది కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కశ్మీర్ సమాజం ప్రతికూలతలను అధిగమించింది. పట్టుదలతో ఉంది. న్యూయార్క్ వలసదారులందరిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించించుకుంది. కశ్మీరీ ప్రజలకు మత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తదితర మానవహక్కులను కల్పించడానికి న్యూయార్క్ ప్రయత్నిస్తుంది అని తీర్మానంలో పేర్కొన్నారు.
దీనిపై వాషింగ్టన్లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. అమెరికా మాదిరిగా భారత్ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, భిన్నమైన సంస్కృతికి నిదర్శమని, అందులో జమ్మూ-కశ్మీర్ భాగమేనని గుర్తు చేశారు. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని సృష్టం చేశారు. ఇది జమ్మూ-కశ్మీర్ గొప్ప సంస్కృతిని, సామాజిక స్థితిని తప్పుగా చూపించేందుకు.. ప్రజలను విడదీసేందుకు స్వార్థ ప్రయోజనాలతో చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యులను కలిసి భారత్-అమెరికా సత్సంబంధాలపై చర్చిస్తామన్నారు.